వైసీపీ నేత పూడి శ్రీహరి బెంగళూరులో అరెస్ట్
- చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన కేసు
- శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
- శ్రీహరిని బెంగళూరులో అరెస్ట్ చేసి కుప్పంకు తీసుకువస్తున్న పోలీసులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంబంధించిన మార్ఫింగ్ ఫొటోల కేసులో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో చుక్కెదురైన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చేతిలో కత్తి ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది. గతంలో కుప్పం కోర్టు ఆయన రిమాండ్ను తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టు కుప్పం కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేయడం శ్రీహరికి ఇబ్బందిగా మారింది.
అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేయడంతో పోలీసులకు మార్గం సుగమమైంది. దీంతో బెంగళూరులో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కుప్పంకు తరలిస్తున్నారు.